26, నవంబర్ 2013, మంగళవారం
మంచీచెడులు మరియు ఇస్లాం
సయ్యిద్ అబ్దుస్సలామ్ ఉమ్రీ
మనిషి ప్రకృతి సిద్ధంగా సంస్కార ప్రియుడు. మంచిని ప్రేమిస్తాడు. చెడును ద్వేషిస్తారు. మనిషిలోని ఈ సహజ భావనను అతని పోషణ, శిక్షణ, వాతావరణాలు పెంపొందిస్తాయి లేదా అణగద్రొక్కుతాయి. మంచి పెరిగితే మానవత్వ మందారాలు విరబూస్తాయి. మానవ మను గడ సవ్యంగా సాఫల్య బాటన సాగుతుంది. సమాజం మొత్తం సం స్కార సౌరభాలతో గుభాళిస్తుంది. అదే మంచి అన్నది అణిగితే పైకి వచ్చేది, పెరిగేది చెడు అనుభవాలే, కుళ్ళు బ్రతుకులే, దుర్గంధభరిత వాతావరణమే. వాతావరణం నైతికంగా కలుషితమయినప్పుడు సర్వత్రా - వ్యక్తుల్లోనూ, సమాజంలోనూ కానవచ్చేది, చెలామణి అయ్యేది, రాజ్యమేలేది చెడులే. అటువంటి దుస్థితి ఎక్కడ, ఎప్పుడు చోటు చేసు కున్నా దాన్ని దూరం చేసేందుకు ప్రయత్నించడం సమాజంలోని ప్రతి పౌరుని ప్రథమ కర్తవ్యం అంటుంది ఖుర్ఆన్: ''మీలో మంచి వైపు ఆహ్వానించేవారు, మేలు చేయండి అని ఆజ్ఞాపించేవారు, చెడు నుండి వారించేవారు తప్పకుండా ఉండాలి. ఇటువంటి సంస్కరణాభిలాషులే సాఫల్యం పొందుతారు''. (ఆల్ ఇమ్రాన్: 104)
మనిషిలో మంచీచెడులనేవి ప్రకృతి సహజంగానే నిబిడీకృతమయి ఉంటాయి. వాటిని గ్రహించగలిగే శక్తియుక్తుల్ని సయితం అతను కలిగి ఉంటాడు. కారణం - మంచీచెడుల విచక్షణాజ్ఞానం అతనిలో పొందు పరచింది పరమోన్నత ప్రభువయిన అల్లాహ్ాయే. ఖుర్ఆన్లో ఇలా ఉంది: ''మానవాత్మ సాక్షిగా! దాన్ని తీర్చిదిద్దినవాని సాక్షిగా! మరి ఆయన దానికి దాని దుర్మార్గాన్ని, దాని దైవభీతిని అంతర్ప్రేరణ ద్వారా ఎరుక పర్చాడు''. (అష్ షమ్స్; 7,8)
ఏ పని ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా, ప్రాపంచికంగా, పారలౌకికంగా, నైతికంగా, సామాజికంగా, విలువల పరంగా, చట్టం రీత్యా ఏ విధమయినటువంటిదో మనిషి మనసే అతనికి సాక్ష్యం పలుకుతుంది. తాను తలపెట్టబోయే ఆ కార్యం మానవునికి, వ్యక్తిగతంగా, సమాజాని కి సమిష్టిగా మేలు చేకూరుస్తుందో, కీడు కలుగజేస్తుందో అతని అంత రాత్మే అతనికి బోధ పరుస్తుంది. ఈ అంతరాత్మ ప్రబోధనం వల్లనే వ్యక్తి స్వతహాగా తాగుబోతయినా, తన పిల్లల విషయంలో దాన్ని అస హ్యించుకుంటాడు. తాను స్వతహాగా అన్యాయపరుడయినా తన విష యంలో న్యాయాన్నే కోరుకుంటాడు. తాను స్వతహాగా దుర్మార్గుడయినా తనపై ఒకరు దౌర్జన్యం చేయడాన్ని సుతరామూ సహించడు. ఈ సెన్స్ ను, కామన్సెన్స్ను, ఈ అవగాహనను, ఈ తారాతమ్యాన్ని, ఈ ఇంగిత జ్ఞానాన్ని అతని అంతరాత్మే ప్రబోధిస్తుంది అని ఖుర్ఆన్ చెప్పడంతోపాటే - ''దానిని (మనసును మనో మాలిన్యం నుండి) పరిశుద్ధ పరచు కున్నవాడు సాఫల్యం పొందాడు. మరియు దాని (అంత రాత్మ ప్రబోధ నాన్ని) అణచి పెట్టినవాడు నష్టపోయాడు''. (అష్ షమ్స్; 8,9) అంటుంది.
మానవునిలో ఈ ప్రేరణను మాధవుడు కలుగజేయడమేకాక, అతని మార్గదర్శనార్థం ఒక లక్ష ఇరవై నాలుగు వేల మంది ప్రవక్తలను, అనేక గ్రంథాలను అవతరింపజేసి - సత్యమేదో, అసత్యమేదో, న్యాయమేదో, అన్యాయమేదో, మంచి ఏదో, చెడు ఏదో విశద పర్చాడు. అయితే మంచీచెడుల్ని అవలంబించే స్వేచ్ఛ మాత్రం మానవునికి మాధవుడు ప్రసాదించాడు. ఖుర్ఆన్లో ఇలా ఉంది: ''మరి మేము అతనికి వినేవాడుగా, చూసేవాడుగా చేశాము. నిశ్చయ ంగా మేమతనికి మార్గం కూడా చూపాము. ఇక అతను కృతజ్ఞుడుగా వ్యహరించినా లేక కృతఘ్నుడుగా తయారైనా (అతని ఇష్టం. మేము అతని స్వేచ్ఛను హరించలేదు). అయితే, కృతఘ్నతకు పాల్పడినవారి కోసం మేము సంకెళ్ళను, ఇనుప పట్టాలను, జ్వలించే అగ్నిని సిద్ధం చేసి ఉంచాము''. (అల్ ఇన్సాన్: 3,4) అని హెచ్చరించడమే కాక, ''మిమ్మల్ని మీ పరివారాన్ని నరకాగ్ని నుండి కాపాడుకోండి'' అని జాగు రూక పర్చడమేకాక, మంచిని గురించి ఆదేశించడం, చెడు నుండి వారించడం మీ అందరి బాధ్యత అంటున్నాడు. వినడం, వినకపోవడం వారి ఇష్టం.-చూడండి: 'ఇది సత్యం. మీ ప్రభువు తరఫు నుంచి వచ్చింది. ఇష్టమైనవారు దానిని స్వీకరించవచ్చు. ఇష్టం లేనివారు దాని ని తిరస్కరించవచ్చు''. (తౌబా: 29)
కాబట్టి సమాజంలోని చెడుల్ని అరికట్టే బాధ్యత సంఘశ్రేయోభిలాషు లైన వారందరిపై ఉంటుంది. ముఖ్యంగా ముస్లింలపై. ఎందుకంటే వారిని ప్రజా శ్రేయార్థమే ఉనికిలోకి తీసుకు రావడం జరిగింది గనక. ''విశ్వసించిన జనులరా! ఇకనుండి మానవులందరికి మార్గదర్శనం చేస్తూ వారిని సంస్కరించడానికి ఉనికిలోకి తీసుకురాబడిన శ్రేష్ఠ సముదాయం మీరే. మీరు మంచి పనులు చేయమని ఆదేశిస్తారు. చెడుల నుండి వారిస్తారు. అల్లాహ్ను ప్రగాఢంగా విశ్వసిస్తారు.'' (ఆల్ ఇమ్రాన్: 110)
ఆ నిమిత్తం మహాప్రవక్త(స) చేెసిన మహోపదేశం గమనార్హం! ఆయన ఇలా అన్నారు: ''మీలో ఎవరయితే చెడును చూస్తారో, వారు తన చేతి తో ఆపాలి. ఒకవేళ అంత శక్తి లేకపోతే తన నాలుకతో దాన్ని నిర్మూ లించాలి. అదీ అతను చేయలేకపోతే కనీసం మనసులోనయినా ఆ కార్యాన్ని అసహ్యించుకోవాలి. అయితే ఇది విశ్వాసపు అధమ స్థితి అన్న విషయం గుర్తుంచుకోండి''. (ముస్లిం)
చేతితో అంటే, వ్యక్తి స్థాయిలోనూ, సంస్థ స్థాయిలోనూ, పభుత్వ స్థాయి లోనూ శక్తిని ఉపయోగించి చెడును దూరం చేసే ప్రయత్నం చేయడం. ముఖ్యంగా సంస్థలు, ప్రభుత్వాలు ఈ మహత్కార్యానికి పూనుకున్నట్ల యితే గొప్ప ఫలితాల్ని రాబట్టుకోవచ్చు. ఎందుకంటే, 'లోకో భిన్న రుచి' అన్నట్టు సమాజంలో అందరూ ఒకేలా ఉండరు. కొందరికి ప్రభువు భయం ఉంటే, మరికొందరికి ప్రభుత్వం విధించే శిక్ష భయం ఉం టుంది. ఈ కారణంగానే ఖుర్ఆన్ - మనిషికి దైవభీతిని, నైతిక రీతిని ప్రబోధించడంతోపాటు,స్వర్గసౌఖ్యాల గురించి, నరకయాతనలను ప్రస్తా వించడంతోపాటు దైవ శాసనోల్లంఘనకు పాల్పడేవారికి ప్రాపంచిక జీవితంలోనే శిక్ష అమలు పర్చాలని ఆదేశించడమే కాక, ''బుద్దీ వివే కాలు గల జనులారా! ప్రతీకార చట్టంలోనే మీకు సముజ్జీవనం లభి స్తుంది. మీరు ఈ శాసన ఉల్లంఘనకు పాల్పడకుండా మెలుగుతారని భావించబడుతోంది''. (అల్ బఖర: 179)అని నొక్కి వక్కాణించింది. నోటితో ఆపడం అంటే, మనిషి ఉక్తి మహా శక్తిలా పని చేస్తుంది అన డంలో ఎలాంటి సందేహం లేదు. ఒక మామూలు పోలీస్ సైరన్కే దొం గలు, నేరస్థులు ఎక్కడి వారు అక్కడే గప్చిప్ అయిపోతారంటే, శబ్దం తాలుకు ప్రభావం ఎటువంటిదో అర్థం చేసుకోగలం. అలాగే - ఇంట్లో పిల్లలుగాని, ఇల్లాలు గాని ఏదయినా చేయరాని పని చేస్తే ఒక గద్దింపు చర్య ఎంతటి ప్రభావవంతంగా పని చేస్తుందో మనందరికి అనుభవమ యిన విషయమే. గళానికే కాదు, కలానికి సయితం చరిత్రను తిరగ రాసిన ఖ్యాతి ఉంది. కాబట్టి చెడు ఎక్కడ, ఏ స్థాయిలో ఎవరు చేస్తూ చూసినా, చేసేవారు అయినవారయినా, కానివారయినా వారించడం మానసం గల ప్రతి మనిషి ద్వితీయ కర్తవ్యం. కాబట్టి సాహితీవేత్తలు, కలంకారులు తమ రాతల ద్వారా మంచిని పంచే, పెంచే ప్రయత్నం చేయాలి. చెడును అది సాహిత్యంలో ఉన్నా, సినిమాల్లో ఉన్నా, సమాజం లో ఎక్కడ ఏ పాళ్లల్లో ఉన్నా అరికట్టేందుకు కంకణం కట్టాలి. పై రెండు స్థాయిలోనూ లేని ప్రజలు కనీసం ఆ చెడును మనస్ఫూర్తిగా నిరసిం చాలి. అయితే ఇది సామాజిక స్పృహకు సంబంధించిన అధమ స్థాయి అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. అదీ ఒక వ్యక్తి చేయడం లేదంటే, ఇక అతనిలో మానవత్వం లేనట్టే లెఖ్క.
మనిషి మంచి మనిషిగా బ్రతకాలి. దుర్గుణాల దుర్గంధాన్ని దూరం చేసుకుని, మంచి మల్లెల, మందారాల గుభాళింపుని మది నిండా నింపు కుని జీవించాలి. రెక్కలు రాలిపోతే ఎలాగయితే అందమయిన గులాబీ అందవికారంగా తయారవుతుందో, మంచి, మానవత్వాలు లేకపోతే అర్థ విహీనమవుతుంది జీవితం. మంచీచెడులనేవి జీవితంలో మమేకమయిన అంశాలే అయినప్పటికీ, చుట్టూ ఉన్న ముళ్ళు గుచ్చుకోకుండా మనం గులాబీని ఎలా కోసుకుంటామో, చెడు అనే చీకట్లు చిమ్మకుండా జీవి తాన్ని కాపాడుకోవాలి. అందుకు కావాల్సిన నేర్పూ, ఓర్పూ మనకు అల వడాలి. దాని తాలూకు మంచీచెడులు మనకు తెలియాలి.
మనలోని కల్మష కాలుష్యం అధికమయినప్పుడల్లా పశ్చాత్తాప పవిత్ర జలంతో దాన్ని కడగాలి. అహంకార పొరలు మన కళ్లకు గంతలు కట్టే ప్రయత్నం చేెసినప్పుడల్లా జ్ఞాన కాంతితో మనం సత్యాన్ని సవినయంగా దర్శించాలి. పదవీ వ్యామోహం, కనక కామం మన స్పీడుకి కామాలు పెట్టాలనుకున్నప్పుడు పరలోక చింతనతో దాన్ని ఫుల్స్టాప్ పెట్టాలి. మని షిగా పుట్టిన మనం మహా మనీషిగా ఎదిగేందుకు అహర్నిశలు పరిశ్ర మించాలి.
అయితే 'మనిషిగా మనం ఇది చెయ్యాలి, ఫలానాది సాధించాలి అన గానే' 'అబ్బా' అన్న బరువయిన నిట్టూర్పుతో 'కప్పదాటు'గా వ్యవహరి స్తుంటారు కొందరు. అసలు మనిషి పుడుతూనే బోలెడన్ని బాధ్యతలతో పుట్టాడు అన్న విషయం వీరు గ్రహించరు. వారికి వారు నిర్వర్తించవల సిన బాధ్యతలు గుర్తుకు రావుగానీ, హక్కులు మాత్రం బాగానే గుర్తుం టాయి. మనిషి హక్కుల్ని గుర్తుంచుకుని, బాధ్యతల్ని విస్మరిస్తే అతనితో పాటు సంసారం, సమాజం కూడా ఉపద్రవం పాలవుతుంది.
మన బ్రతుకుకి మనమే రథసారథులం. మన మేథతో, మన విజ్ఞతతో మన బ్రతుకు బండిని మనమే నడిపించుకోవాలి. జయాపజయాలు ఎంచుకునే అధికారం మనకుంది. మంచీచెడులను అవలంబించే స్వేచ్ఛా మనకుంది. అయితే ఈ పరిమిత అధికారం, స్వేచ్ఛ మన చివరి శ్వాస అగేంత వరకు మాత్రమే. ఆ తర్వాత లెఖ్కలుంటాయిగానీ కర్మలుండవు. కనుక రేపు ప్రళయ దినాన ప్రభువు మనతో లెఖ్క తీసుకోక ముందే మన జీవిత లెఖ్కల్ని మనం సరి చేసుకోవాలి. ఉన్న కరెప్షన్స్ని కరెక్ట్ చేసుకుని ప్రభువుచే పర్ఫెక్ట్ అనిపించుకోవాలి.
25, నవంబర్ 2013, సోమవారం
ప్రతిఘటన
ఏకాంత నిశ్శబ్దంతో సత్యం తన శక్తిని కళ్ళకు కడుతుంది. ప్రజలారా! నిశి రాత్రి నిశ్శబ్దంలో ఒంటరిగా ఉన్నప్పుడు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. మీరు పవిత్రంగా భావించే కట్టుబాట్లను బేరీజు వేసుకోండి. ఈ లోకంలో 'నిన్నటివారు - రేపటివారు' అనే రెండు రకాల మనుషులుంటారు. మీరు దేనికి చెందినవారో ఆత్మ పరిశీలన చేసుకోండి. మీరు తేజోవంతమైన రేపటి జీవితంలో ప్రవేశించేవారో, లేక నిన్నటి అంధకార ఊబిలో మరింత లోతుకు కూరుకుపోయేవారో ఆత్మ విమర్శ చేసుకోండి. నిన్నటి బానిస బ్రతుకు మీకిష్టమో, రేపటి స్వేచ్ఛాయుత బంగారు భవిష్యత్తుకు బాట వేసుకుంటారో మీకు మీరే తేల్చుకోండి. మానవుని అంధ విశ్వాసాలు కడలిపై తెలియాడే నురుగు వంటివి. గాలి వీస్తే అది గల్లంతే! సత్యం వస్తే అంధ విశ్వాసాలన్నీ ఇక అంతే!!
ఆ విధంగా ప్రవక్త శ్రీ (స ) ప్రజా విద్రోహక చర్యల్ని శాంతి విఘాతక పద్ధతుల్ని, సమాజ విచ్ఛన్నకర ధోరణిని ఖండించారు. సమాజాన్ని, ప్రజల్ని - వారి ఆచార వ్యవహారాల్ని, మూఢ నమ్మకాల్ని ప్రతిఘటించారు. శాంతి సందేశంతో ప్రజా విప్లవాన్ని తెచ్చేందుకు ప్రయత్నించారు.
మహా ప్రవక్త ( స ) వారి మాట అక్షర సత్యంగా, శైలి అందంగా, నడవడిక ఆకర్షణీయంగా ఉంది. ప్రజలు సత్యాన్ని ఆస్వాదించేలా చేస్తున్నది. ఇది గమనించిన కొందరు పుర ప్రముఖులు - ప్రవక్త శ్రీ (స ) వారి సందేశం తమ ఇష్టారాజ్యాలకు ప్రమాదకరమైనదని, భావించి ఆయన్ను అన్ని విధాలా నిలువరించేందుకు సిద్ధమయ్యారు. ఆయన్ను, ఆయన పక్షాన నిలిచిన ఆయన వంశీయులను సంఘం నుండి బహిష్కరించి 'షొబె అబూ తాలిబ్' లోయలో మూడు ఏండ్ల పాటు నిర్బంధించారు. వారిపై అనుచితమైన ఆంక్షల భారాన్ని వేశారు. అప్పటికీ ఆయన్ను విశ్వసించినవారు చాలా మందే ఉన్నారు. ఆయన (స ) వారి సందేశాన్ని తొలుత స్వీకరించినవారు; పురుషులలో - హజ్రత్ అబూ బకర్ (ర ). స్త్రీలలో హజ్రత్ ఖదీజా (ర ). వృద్ధులలో హజ్రత్ యాసిర్ (ర ). వృద్ధ స్త్రీలలో హజ్రత్ సుమయ్యా (స ). బాలల్లో హజ్రత్ అలీ (ర ) ప్రముఖులు.
ముహమ్మద్ (స ) సత్యసంధుడు - సచ్చీలత గల పరమ ఆదర్శ పురుషుడు. అయినప్పటికీ ధర్మం పేరుతో మా ఆచార వ్యవహారాలను తప్పు పడుతున్నాడు. మాది బూజు పట్టిన వ్యవస్థ అని, కాలం చెల్లిన శాస్త్రం అని కొట్టి పారేస్తున్నాడు. యజమాని - బానిస అన్న కృత్రిమమైన గీతలు సమసిపోవాలంటున్నాడు. బానిసగా మార్చబడ్డ వారే గానీ బానిసగా తల్లి కడుపున పుట్టిన ఒక్కడు కూడా లేడు అంటున్నాడు. మనిషిలోని మంచితనమే ఏ వంశ విశిష్టతకైనా వన్నె తెస్తుంది అంటున్నాడు. అతన్ని అనుసరించేవాళ్ళు దేన్నయినా వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ సత్యాన్ని మాత్రం ప్రాణాలు పోయినాగాని విడిచి పెట్టం అంటున్నారు. ఇది మన పూర్వీకులు ఏర్పరచిన వ్యవస్థపై తిరుగుబాటే. కాబట్టి మహమ్మద్ (స ) ఆగడాలను ఎలాగైనా అరికట్టాలి. అతని పోకడలను నియంత్రించాలి.
అలా ప్రవక్త (స ) వారిని ఎన్నో ఇబ్బందులకు గురి చేయడం జరిగింది. శారీరకంగా బాధించేవారు కొందరైతే, మానసికంగా క్షోభకు గురి చేసేవారు కొందరు. ఆయనపై చెత్తా చెదారం విసిరేసేవారు. రాత్రివేళ ఆయన నడిచి వెళ్ళే మార్గంలో ముళ్ళ కంపలు పడేసేవారు. ఆయన ప్రార్థన చేస్తుంటే దుప్పటిని త్రాడుగా చేసి గొంతు నులిమేసేవారు. ఆయన సజ్దాలో ఉండగా ఆయనపై ఒంటె ప్రేగుల్ని తీసుకొచ్చి పడేసేవారు. అందరూ ఆయన్ని బాధ పెట్టి పైశాచికంగా ఆనందిస్తున్నారు. తాము చేసిన ఘనకార్యాన్ని నలుగురితో చెప్పుకుని మీసాలు మెలేస్తున్నారు.
ఓ రోజైతే విసిరిన రాళ్ళ దెబ్బలకు దేహమంతా రక్తంతో తడిసి ముద్దయింది. తల సైతం పగిలి రక్తం చిమ్ముకొస్తూ ఉంది. ఆ రక్తాన్ని తుడుస్తూ చిన్న పిల్ల హజ్రత్ ఫాతిమా (ర ) నాన్నా! ఎందుకు మీకే ఇన్ని కష్టాలు? అని బోరున ఏడ్చేశారు. అమ్మా! నాకు జరిగింది తక్కువమ్మా. పూర్వం ప్రవక్తల్ని సత్యసందేశం అందజేసి నందుకు శిక్షగా కొందరిని నిలబెట్టి నిలువునా రంపంతో చీరేస్తే, ఇంకొందరి దేహ మాంసాల్ని లోహపు దువ్వెనలతో లాగి ఎముకల్నుంచి వేరు చేసేవారు; మరికొందరి శిరస్సులను ఖండించి కాబోయే భార్యలకు బహుమానంగా ఇచ్చారు. అమ్మా! ధర్మ సంస్థాపన జరగాలన్నా జరగాలి. లేదా ఈ మార్గంలో నా ప్రాణాలైనా పోవాలి. ధర్మసంస్థాపనార్థాయ వందసార్లు మరణించి వందసార్లు బ్రతికించబడినా నేను ధర్మోన్నతి కోసమే పోరాడుతాను. అన్నారు ప్రవక్త శ్రీ (స ).
కెరటాల నురుగు చూసి, సాగర సామర్థ్యం అంచనా వేసినట్లు, మక్కా ప్రజలు ప్రవక్త (స ) వారి సందేశాన్ని చిన్న చూపు చూశారు. ఇది చాలా తేలికైన విషయంగా భావించారు. ఆయన సందేశం సత్య సస్య విప్లవానికి నాంది అని వారు ఆ క్షణం గ్రహించలేకపోయారు. జీవిత వాస్తవమే సత్యం. దాని ఆది ఏ గర్భంలోనూ లేదు. దాని అంతం ఏ సమాధిలోనూ లేదు. అది నిత్యం - నిర్మలం. అది నిజం - మారని ఇజం.
20, నవంబర్ 2013, బుధవారం
స్ఫూర్తి - సమయస్ఫూర్తి
మహా ప్రవక్త ముహమ్మద్ (స) నిలువెల్లా కారుణ్యం. ఆయనలో దయాగుణం, క్షమా గుణం, సం స్కారం, మర్యాద, మృదుత్వం, వాత్సల్యం, నిజాయితీ,సచ్చీలత, సత్యసంధత, సౌమ్యం, దాతృ త్వం, ప్రేమ, జాలి సంపూర్ణంగా మూర్తీభ
వించి ఉండేవి. ఖుర్లో ఇలా ఉంది: ''(ఓ ముహమ్మద్!) నిశ్చయంగా నీవు మహోన్నత శీలశిఖర అగ్ర
భాగాన్ని అధిరో హించి ఉన్నావు''.(నూన్: 4)
ఏ సత్యసంధుని (సాదిఖ్) గురించయితే ఆయన సతీమణి, విశ్వా సుల మాత హజ్రత్
ఆయిషా(ర) ''ఆయన గుణగణాలు ఖుర్ఆన్కు దర్పణం వంటివి'' (ముస్లిం) అని చెప్పారో....
ఏ సచ్చీలుని (అమీన్) గురించి ఆయన ప్రభువు ''నిశ్చయంగా మేము నిన్ను
(ఓ ప్రవక్తా!) సమస్త లోకాల పాలిట మూర్తీభ వించిన కారు ణ్యంగా చేసి పంపాము'' (అన్బియా: 107) అని కితాబు ఇచ్చాడో, ఏ ప్రవక్తల అధినాయకుని
(సయ్యిదుల్ అన్బియా)పై ''చదువు'' అన్న పదంతో దివ్యవాణి అవతరించిందో, ఏ ఆదరణకర్త (అహ్మద్, ఫార్ఖలీత్) గురించయితే
దైవ ప్రవక్తలు,ఆకాశ గ్రంథాలన్నీ గళమెత్తి భవిష్యవాణులు విన్పించా యో, ఏ అల్లాహ్ నేస్తం
(ఖలీలు ల్లాహ్) సహచర్యం కోసం ఓ బాలుడు తన తల్లిదండ్రుల్ని సయితం వదులుకోవడానికి సిద్ధమయ్యాడో,ఏ స్వేచ్ఛాప్రదాత
(ఇబ్నుల్ అవాతక్)
అయితే సఫా పర్వతంపై నిలబడి ''మీ అందరి ఆరాధ్య దైవం ఒక్కడే- లా ఇలాహ ఇల్లల్లాహ్ అని పలకండి, అరబ్బు, అరబ్బేతర రాజ్యాలు
మీ వశమవుతాయి, మీ సకల సమస్యలకు సంపూర్ణ పరిష్కారం లభిస్తుంది. మీరు ఇహపరాలసఫలీకృతులవుతారు'' అని ఘంటాపథంగా ప్రకటిం
చారో,ఏ క్రాంతికారుడు(మాహి) అయితే - బద్ర్
రణభూమిలో సయితం చేతిలో కరవాలం పట్టుకోవడానికి బదులు తన నొసటను దైవ సన్నిధిలో వాల్చి
దీనాతిదీనంగా 'మానవ జాతి ముక్తి' కోసం వేడుకున్నారో, ఏ (అగ్రజులు) హాషిర్ అయితే ప్రియాతి ప్రియమయిన మక్కా నగరాన్ని వదలిపోవడానికి కారకులయినవారు
యుద్ధ ఖైదీలుగా పట్టుబడి వచ్చినప్పుడు గౌరవాదరణలతో సాగనంపారో,ఏ సత్పురుడు, సంపూర్ణుడయితే (ఆఖిబ్)
మక్కా విజయం లభించిన సందర్భంగా కృతజ్ఞతాభావంతో, తలను వంచి, నుదురు మాటి మాటికీ ఒంటె మూపురానికి తగులుతుండగా
అత్యంత నిరాడంబరతతో మక్కాలో ప్రవేశించారో, ఏ ధృవీకరణకర్త (ముఖ్ఫీ) అయితే రేయింబవళ్లు తన చావు
ప్రణాళిలు వేసేవారిని, తన బాబాయిను చంపి గుండె కాయను కరకర నమిలిన కసాయి వారిని కనికరించి వదిలేశారో, ఏ ప్రక్షాళనకర్త
(ముజక్కి) అయితే కాళ్ళు ఉబ్బిపోయేంత సుదీర్ఘ
ప్రార్థనలు చేస్తే,
స్వయంగా ఆ సర్వేశ్వరుడే (ఓ ముహమ్మద్!) ''నిశ్చయంగా నువ్వు ఒక్కోసారి మూడింట రెండు వంతుల
రాత్రికంటే కొంచెం తక్కువ,
ఒక్కోసారి సగం రాత్రి,
ఒక్కోసారి మూడింట ఒక వంతు రాత్రి ఆరాధనలో నిలబడుతున్నావని నీ ప్రభువుకు తెలుసు'' అని కితాబు ఇచ్చాడో, ఏ సాక్షి (షాహిద్)
మరియు పూర్తి అరబ్బుకి అధినాయకుని ఇంట్లోనయితే ఆయన పరమపదించిన నాటికి దీపం వెలిగించడానికి
నూనె లేదో, ఏ శుభవార్త విన్పించేవారి (ముబష్షిర్) కుటుంబీకులయితే రోజులు, వారాలు, నెలల తరబడి ముప్పూటలా భోంచేసి ఎరుగరో,
ఏ భయపెట్టేవారయితే (నజీర్) 'లేదు' అన్న మాట ఒక్క 'లా ఇలాహ ఇల్లల్లాహ్' లో తప్ప చెప్పి ఎరుగరో, ఏ ప్రబోధకుని (దాయీ)
పట్లయితే ఆయన సహచరులు అమిత ప్రేమాభిమానాలు కనబర్చారో, ఏ దీప శిఖామణి (సిరాజ్
- మునీర్) వుజూ నీళ్ళను,
చెమటను, రక్తాన్ని భూమి మీద పడకుండా దాచుకునే వీరాభిమానులుండే వారో, ఏ వాత్సల్యమూర్తి (రవూఫ్) అయితే దారిన నడిచి వెళుతుంటే
చెట్లు సయితం సగౌరవంగా సలామ్ చెప్పేవో, ఏ దయాహృదయుడి (రహీమ్) తోనైతే పశువులు సయితం వాటి
గోడుని చెప్పుకుని విలపిం చేవో, ఏ విశ్వసనీయుని (ముతవక్కిల్ ) విరహావేదనతో చెట్లు సయితం ఎక్కి ఎక్కి ఏడ్చేవో, ఏ ముస్తఫా అయితే ధాన్య, ధన రాసుల్ని ప్రజలలకు
పంచేసి, అవసరం కోసం వచ్చిన గారాల పట్టి ఫాతిమా (ర)ను ''33సార్లు సుబ్హానల్లాహ్, 33 అల్హమ్దు లిల్లాహ్, 33 సార్లు అల్లాహు అక్బర్, 1 సారి లా ఇలాహ ఇల్లల్లాహు
వహ్దహు లా షరీక లహు లహుల్ముల్కు వలహుల్ హమ్దు వహువ అలా కుల్లి షైయిన్ ఖదీర్- చదువుకో, అది నీ రోజంతటి శ్రమ నుండి ఉపశమనం కలిగిస్తుంది'' అని సాగనంపారో, ఏ ముజ్తబా అయితే
అతిథి మర్యాదలు ఘనంగా చేయడమే కాక, ఆ అతిథి మహారధుడు చేసిన నిర్వాకాన్ని ఎవ్వరికి
చెప్పకుండా తన స్వహస్తాలతో అతని మలినాన్ని
శుభ్ర పర్చారో, ఏ నిరక్షరాసి (ఉమ్మీ ) అయితే అలవాటు ప్రకారం తలపై చెత్త పడ లేదేమిటి? చెత్తపోసే వ్యక్తికి
ఏమయిందోనని కలత చెంది పరామర్శించడానికి అతని ఇంటి తలుపు తట్టారో, ఏ పాపరహితులయితే
(మాసూమ్) అయితే దారమ్మిడి తనను బండ బూతులు తిట్టే ఓ పెద్దమ్మ బరువు ఎంతో ఓపిగ్గా మోసుకెళ్ళి
ఆమె గమ్యానికి చేర్చి, 'ఎవరు నాయనా నువ్వు?' అని ఆ పెద్దమ్మ అడిగితే - 'అవ్వా! ఏ వ్యక్తికయితే
దారి పొడుగునా నీవు తీట్ల పురాణం విన్పించావో తను నేనే' అని ఎంతో వినయంగా
చెప్పారో, ఏ ఖాసిమ్ అయితే మెడలో త్రాడేసి బిగించి చంపాలనుకున్నా వారికి సన్నార్గం చూపించమని
ఆ సర్వేశ్వరుని సన్నిధిలో వేడుకున్నారో, ఏ వాలిద్ (తండ్రి) ఆవేదన చూసి విశ్వకర్త సయితం
విస్మయం చెంది ''(ఓ ముహమ్మద్!) ఒకవేళ ఈ జనులు ఈ మాటను (దివ్యవాణిని) విశ్వసించక పోతే నువ్వు వారి
వెను దుఃఖంతో కుమిలి పోతూ నీ ప్రాణాలు పోగుట్టుకుంటావా ఏమి?'' అని ఓదార్చాడో,
దైవ ప్రవక్తల పరంపరను పరిసమా ప్తంగావించిన ఏ వ్యక్తి (ఖాత ముల్
అన్బియా వర్రుసుల్) పవిత్ర జీవితాన్ని స్వయంగా
ఆ సత్య దైవమే ''(ఓ ముహమ్మద్!) నీ ఆయుష్షు సాక్షిగా!'' అని ప్రమాణంగా తీసుకున్నాడో, ఏ నరాశంస హృదయాన్ని,నేత్రాన్ని, మాటని, బాటని, నడకని, నడవడికని గురించి
స్వయంగా అల్లాహ్ జమానతు తీసుకోవడమేకాక, ''ఆయన జీవితంలో అల్లాహ్ను, అంతిమ దినాన్ని విశ్వసించే
వారి కోసం అత్యు త్తమ ఆదర్శం ఉందని, ఆయన (స) అనుసరణే దైవ ప్రేమకు సోపానమని, ఆయన (స) అయిష్టతే
దైవాగ్రహానికి కారణభూతమ''ని చెప్పాడో,అటువంటి మహోన్నత శీల శిఖరం తన ప్రత్యర్థులతో కఠినంగా వ్యవహరించారని, అభిమానం, అనురాగం ఆయనకు ఆమడ దూరంలో ఉండేదని, ఆయనది కఠిన హృదయం
అని ప్రచారం చేయడం, ఆయన తీవ్రవాద స్వభావం గలవారనే ధోరణిలో ఆయన కార్టూన్లు గీయటం, చిత్రాలు తీయడం మానవతే
సిగ్గుతో తలదించుకోవాల్సిన విషయం. అట్టి దుష్ట స్వభావులు ఎంత మంది ఎన్ని కుయుక్తులు
పన్నినా ప్రవక్త (స) వారి కీర్తి పెరుగుతుందేగానీ తగ్గదు అనడానికి ప్రతి ఏటా ప్రపంచ
నలు మూలల నుండి హజ్ కోసం తరలి వచ్చే జనసంద్రమే సజీవ సాక్షి! ఇక కుత్సిత మతుల విష యంటారా? వారందరికి అల్లాహ్
ఒక్కడే సరిపోతాడు: ''(ఓ ముహమ్మద్!) నిన్ను పరహసిమచేవారి సంగతి చూసుకోవడానికి మేమే చాలు''.
(అల్హిజ్ర్: 95)
మన తక్షణ కర్తవ్యం ఏమిటి?
శాంతికి శత్రువులు ఇటువంటి చేష్టల ద్వారా ముస్లిం జన సమూహ సహనానికి
అగ్ని పరీక్షే పెడుతున్నారు. ప్రవక్త (స) వారిని తమ, తన మాన, ధనాలకన్నా ఎక్కువగా అభిమానించే కొందరి తొందరపాటు
చర్యల్ని ప్రపంచానికి చూపించి - 'ఇస్లాం, ముస్లింలంటే ఇదే' అని నమ్మబలకడానికి వేసిన ఎత్తుగడలలో భాగమే ఇటు వంటికవ్వింపు చేష్టలు. నేడు
మానవ సమాజం ఎదుర్కొం టున్న సకల సమస్యలకు పరిష్కారంగా వేదిక మీదికి వస్తున్న ఇస్లాం
అఖండ జ్యోతిని అర చేత్తో ఆపాలని విఫల ప్రయత్నం చేస్తున్నారు.2030వరకు ముస్లిం ల సంఖ్య
3 వందల కోట్లకు చేరుకునే
అవకాశం ఉందనే అంచనాలతో భయపడుతూనే వారిని ఎన్ని విధాలుగా వీలయితే అన్ని విధానాలను అవలంబించి సంహరించేందుకు కుయుక్తులు పన్నుతున్నారు, కొన్ని చోట్ల వారి
ఎత్తుగబడలు ఫలిస్తున్నాయి కూడా.
ఇట్టి క్లిష్ట స్థితిలో మనం తీవ్ర భావావేశంతో విజృంభించడం అనేది
వారి చదరంగంలో పావులుగా మారడమే అవుతుంది. కాబట్టి ప్రవక్త (స) వారి పవిత్ర జీవితాన్ని
స్ఫూర్తిగా తీసుకునే మనం సమయస్ఫూర్తిని ప్రదర్శి స్తూ యుక్తితో వ్యవహరించాల్సి ఉంది.
పెద్ద ఎత్తున ప్రవక్త మహనీయుల పవిత్ర జీవితం గురించి ప్రపంచానికి పరిచయం చేయాల్సి ఉంది.
బ్లాగులు, వెబ్సైట్లు, దిన, వార, మాస పత్రికలు, డివిడీల మాధ్యమంతో 'ఇస్లాం అంటే పరిష్కారమే గానీ సమస్య కాదు, కాజాలదు' అని తెలిజేయాల్సి ఉంది. అలాగే అంతర్జాతీయ స్థాయిలో
దైవ ప్రవక్త పట్ల అనుచితంగా వ్యవహరించేవారిని కఠినంగా శిక్ష అమలు పర్చేలా చట్టం తీసుకు వచ్చేందుకు అవిరళంగా
శ్రమిం చాల్సి, పోరాడాల్సి ఉంది. చివ రిగా ప్రస్తుత ప్రతికూల
పవనాలను చూసి నిరాశకు గురి కాకూడదు. ఆ విషయానికొస్తే నిరాశ చెందటం విశ్వాసికి శోభించని విషయం. ప్రస్తుతం మనం ఎదుర్కొటున్న సమస్యల్లో
ఖచ్చి తంగా అల్లాహ్ మేలు పెట్టి ఉంటాడని మనం బలంగా నమ్ముతూనే, మన క్రియా జీవితం
ప్రవక్త (స) వారి పవిత్ర జీవనానికి ప్రతిబింబంగా ఉండేలా అహర్నిశలు పరిశ్రమించాలి. మనం
మారాలి, మన ప్రవర్తన మారాలి, మారుతూనే ఉండాలి. అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు; ''ఈ పెద్ద అపనిందను కల్పించి తెచ్చింది కూడా మీలోని
ఒక వర్గమే. మీరు దీనిని మీ పాలిట కీడుగా భావించకండి. పైగా ఇది మీ కొరకు మేలైనదే. కాకపోతే
(ఈ కుట్రలో భాగస్తులయిన) వారి లో ప్రతి ఒక్కరికీ వారు సంపాదించిన దాన్ని బట్టి పాపం
లభిస్తుంది. మరి వారిలో చాలా పెద్ద పాత్రను పోషించిన వాడికి మాత్రం మహా శిక్ష పడు తుంది''. (అన్నూర్: 11)
14, నవంబర్ 2013, గురువారం
10, నవంబర్ 2013, ఆదివారం
7, నవంబర్ 2013, గురువారం
మీ చేత వావ్ అనిపించే ప్రకృతి అధ్బుతాలు.!
మనకు ప్రపంచంలో ఎన్నో అద్భుతాలు, వింతలు, అందాలు కనపడుతుంటాయి.
వీటిల్లో ఎక్కువగా కృత్రిమంగా తయారు చేసిన అందాలు, అద్భుతాలే ఉంటాయి. ఇలా కృత్రిమంగా ఎన్ని అద్భుతాలు ప్రపంచంలో ఉన్నా ప్రకృతి మనకందించిన కొన్ని అరుదైన అద్భుతాలు తక్కువనే చెప్పుకోవాలి. ఎందుకంటే వాటిని ఎవరూ క్రియేట్ చెయ్యలేదు. అవి ప్రకృతి నుండి మనకు లభించిన అద్భుతాలు.. అలాంటి వాటిని మీకందిస్తున్నాం..
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)







_08.jpg)









































